శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి

              శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి



కృష్ణమూర్తిగారు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన ఎర్నగూడెం నందు 1866 సంవత్సరంలో అక్టోబరు 29వ తేదీనాడు జన్మించారు. ఉపనయన దీక్షారాంభమందే శ్రౌతస్మార్తముల నెరంగి కావ్యపఠనము సాగించి, రఘువంశ పరిశీలనమందె సంస్కృత కవనపు జాడలు గ్రహించి, 16వయేట తెలుగు కవిత్వమును చెప్పనేర్చి, బహుళశ్లోకములందు స్వీయచరిత్రను వ్రాసి, తండ్రి యజ్ఞములో అధ్వర్యమును సలిపి, బాల్యమును కాటవరమున గడిపి, శ్రీ ఇవటూరి నాగలింగశాస్త్రి గారిని ఆశ్రయించి, శ్రీ మధిరసుబ్బన్న దీక్షితులను సహాధ్యాయముతో బహుళశాస్త్రాంశము లెరిగి, వాగ్దేవి నారాధించి శాస్త్రులుగారు దీర్ఘోపాసనకు పూనుకొనిరి.


వీరికి వేదవిద్యలో పాండిత్యం సంపాదించి గ్రాంథిక భాష మీద గౌరవంతో తన రచనలను కొనసాగించారు. వీరు సుమారు 200లకు పైగా గ్రంథాలు రచించారు. వాటిలో నాటకాలు, కావ్యాలు, జీవిత చరిత్రలు మొదలైనవి ఉన్నాయి. 

ఆయన పండితయశస్వి .'ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థానకవి గండపెండేరం సత్కారం, గజారోహణం ఇలా ఎన్నో సత్కారాలు, బిరుదులూ ఉన్నాయి. ఆ బిరుదులన్నీ ఆయనకు సార్థకమే.
 


శతాధిక గ్రంథాలను రాసిన శ్రీపాదవారు కృతి కర్తె కాదు, కృతి భర్త కూడా. ప్రజ్ఞా వంతుడు మరియు ప్రతిభావంతుడు. శ్రీపాదవారి తర్వాత అంతటి కీర్తిప్రతిష్ఠలు పొందినవాళ్ళు చాలా అరుదుగా వున్నారని చెప్పవచ్చు. అసలు హర్షుడు రాసిన నైషధీయ చరితాన్ని, శ్రీనాధుడు రాసిన శృంగార నైషధాన్ని మళ్ళీ రాయాలని సంకల్పించడమే ఓ సాహసం. అయితే ఎక్కడా కూడా మూల గ్రంథాల సహజత్వం పోకుండా చూసారు. అద్భుతంగా నైషద చరితాన్ని అందించిన ఘనత శ్రీపాద వారికే చెల్లిందని చెప్పవచ్చు. ఇక శ్రీపాద వారికి వచ్చిన పతకాలు, వస్తువులు అన్నింటిని కూడా ఆంధ్రాయూనివర్సిటీకి ఇచ్చేశారు. అయితే అందులో కొన్ని మ్యూజియంకి తరలించగా, కొన్ని ఇంకా ఎక్కడ ఉంచారో తెలియరాలేదు.



శ్రీపాద వారు పత్రికాసంపాదకతచే కింతకీర్తి సంపాదించుకొన్నారు. 'కళావతి'యను ముద్రణాలయమును మద్రాసులో నెలకొల్పి దానిని రాజమహేంద్రవరమునకు మార్చి అవిచ్ఛిన్నముగా దానిని పదియేండ్లు నడిపిరి. అలాగే 'గౌతమి' యను తెనుగుమాసపత్రిక 1908 లో ఆరంభించారు. అది ఒక యేడు నడచి ఆగిపోయింది. వీరి వజ్రాయుధము, మానవసేన, వందేమాతరం అను పత్రికలు మాత్రం నాడు మంచి ప్రచారము లోనికి వచ్చాయి.


వీరి కృతులలో మిగుల ప్రధానమైనది భారతాంధ్రీకరణము. లక్ష శ్లోకములను కొన్ని వేల పద్యములందు పరివర్తనము చేసిరి. ఆంధ్రశారదకు ఎనలేని భూషణములను సమర్పించిరి. తిక్కనభారతములో అనుశాసన పర్వములో పరమేశ్వర మహిమను వర్ణనము విడువబడింది. శ్రీ శంకరాచార్యులు భాష్యము వలన ఈ నామములు విశేషముగా ప్రశస్తినొందినవి! వీనిని విడువక శ్రీ పాద వారు మూలానుసారముగా తమ ఆంధ్రీకరణమును సాగించిరి. తెలుగు కవితకు మిగుల సొంపు చేకూర్చ వివిధ రసములను, గుణాలంకారాదులను శ్రీపాదవారి రచనలందు చూడవచ్చు. వీరు దీనిని రెండు దశాబ్దములలో ముగించిరి.


బొబ్బిలి యుద్ధము నాటకమును శ్రీ పాదవారు వ్రాసిరి. ఇది రంగస్థలమున కెక్కిన దినములలో ఆంధ్రప్రజల విశేషాదరణ పొందినది. ఈగ్రంధమును శ్రీ పాదవారు దివంగతుడైన తమ తనయుడు సుదర్శన సుధికి అంకితమిచ్చిరి. ఈబాలుడు 9ఏళ్ళు అల్లారుముద్దుగా పెరిగి, మేధానిధియై దైవప్రేరణమున తలిదండ్రులను బాసి వారికి తీరని దుఃఖమును కలిగించిపోయెను. స్వరాజ్యోదయము అను గ్రంథము శ్రీ పాదవారి దేశభక్తిని వ్యక్తీకరించింది.


ఆంధ్రాభ్యుదయము అనుచరిత్రాత్మిక పద్యకావ్యములో ఆంధ్రప్రముఖుల గుణగణములను సంక్షేపముగా వివరించిరి. భగవద్గీతాంధ్రీకరణమును శ్రీ పాదవారు సర్వేపల్లి రాధాకృష్ణన్ పండితునికి సమర్పించిరి. అలాగే సంస్కృతంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి జీవిత చరిత్రను వ్రాసిరి. 


ఇతర రచనలు మొత్తం 225 గ్రంథములను శ్రీ పాదవారు రచించారు. ఇందు కావ్యములు, ప్రబంధములు, నవలలు, నాటకములు, ప్రహసనములు, నిఘంటువులు, శతకములు, అష్టకములు, చంధోవ్యాకరణములు, చిత్రకవిత్వములు, బంధకవిత్వము, గర్భకవిత్వములు మొదలయినవి ఉన్నాయి.


శివదండకం, సరస్వతి దండకం ఇలా దండకాలను కూడా పొదిగారు. ముఖ్యంగా వసంతరాత్ర వర్ణన, దమయంతి వర్ణన అమోఘం. శ్రీపాద వారొక్కరే ఒంటిచేత్తో రామాయణ, మహాభారత, భాగవతాలను అనువదించడమే కాక శతాధిక గ్రంథాలను రాసారు. పద్యం, గద్యం, లలితపదాలు అన్నీ ఆయన రచనలో స్పష్టంగా కనిపిస్తాయి.



పదబంధనేర్పరి శ్రీపాదవారు గోదావరితీరం, రాజమహేంద్రవరం తాలూకు ప్రశస్తిని చాటిన శ్రీపాదవారు తన రచనలో ఎన్నో కొత్త పదాలు వాడడమే కాదు, ఒకపదం వేస్తే అర్ధం ఎలా మారుతుంది, ఓ పదం తీసేస్తే అర్ధం ఎలా ఉంటుంది వంటి ప్రయోగాలు చేసారు. 'మరందం, మకరందం' వంటి పదాలు అందుకు ఉదాహరణ. సజాతి, విజాతి, విలోమ పదాలతో పదబంధం చేసిన నేర్పరి శ్రీపాదగారు.


రచనలు :-


నాటకాలు:

కలభాషిణి

రాజభక్తి

భోజరాజ విజయం

శ్రీనాథ కవి రాజీయం

పద్య కావ్యాలు:

గౌతమీ మహత్యం

సత్యనారాయణోపాఖ్యానం

గజానన విజయం

శ్రీకృష్ణ కవి రాజీయం

సావిత్రీ చరిత్రం

వేదాద్రి మహాత్మ్యము

యజ్ఞవల్క్య చరిత్ర

అచ్చతెలుగు కావ్యాలు:

బ్రహ్మానందం

శాకుంతలం

వచన గ్రంథాలు:

సంస్కృత కవి జీవితాలు

కాళిదాస విలాసము

తెనాలి రామకృష్ణ చరిత్రము

చెళ్ళపిళ్ళ వారి చెరలాటము (మొదటి భాగము)

చెళ్ళపిళ్ళ వారి చెరలాటము (రెండవ భాగము)

అనువాదాలు:

శ్రీకృష్ణ భారతం

శ్రీకృష్ణ రామాయణం

శ్రీకృష్ణ భాగవతం

ఇతర రచనలు:

కపిరగిర చరిత్రము

శ్రీకృష్ణ స్వీయచరిత్రము

మార్కండేశ్వర మహత్యము (స్థల పురాణము)

జగద్గురు చరిత్రము ( శంకర విజయము)

సానందసాయుజ్యము

ద్వారకా తిరుమల మహత్యము (స్థల పురాణము)

గౌతమీ పుష్కర మహత్యము

కావేరీ మహత్యము

విజయలక్ష్మీ విలాసము

కామాక్షీ విజయము

ఆంధ్రరాష్ట్ర తృతీయ వార్షికోత్సవము

పురస్కారాలు:-

1.ఆంధ్రవిశ్వకళాపరిషత్తు కళాప్రపూర్ణ బిరుదమొసగినది. 

2.1958లో శాస్త్రిగారు ఆంధ్రాస్థాన కవియై సన్మానింపబడిరి. 

3.ప్రభుత్వము వీరినిమహామహోపాధ్యాయ అని వారిని కీర్తించింది.

బిరుదులు:-

మహామహోపాధ్యాయ

కవిసార్వభౌమ

కవిరాజు

కవిబ్రహ్మ

ఆంధ్రవ్యాస

అభినవ శ్రీనాథ

వేద విద్యా విశారద

ప్రసన్న వాల్మీకి

కళాప్రపూర్ణ మొదలగునవి.

చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి కవీంద్రుడు వీరి శిష్యుడు. వీరితో శ్రీ పాదగారికి కొంతకాలము వైరము గడిచినను అటుపై అది సమసినది. గిడుగు రామమూర్తి గారితో కూడా అదే
వైఖరి నడిచినను అటుపై సఖ్యులుగా ఆత్మీయులుగా నడుచుకొనిరి.


 స్మార్తం, వేదం, శ్రౌతం ఈ మూడు నేర్చుకున్న గొప్ప పాండిత్యం గల శ్రీపాద వారు ఆయన తండ్రి నిర్వహించిన యజ్ఞానికి ఆధ్వర్యం వహించారు. ఇంటికి వచ్చినవాళ్ళు చివరకు కోర్టుకేసులు వేసినవాళ్లు వచ్చినా సరే ఆతిధ్యం ఇచ్చి అన్నంపెట్టిన మహోన్నత వ్యక్తిత్వం వీరిది.


 శ్రీకృష్ణకవి చరిత్రము పేర కృష్ణమూర్తిశాస్త్రిగారి
జీవిత చరిత్ర, తన జీవితంలోని వివిధ సంఘటనలను చెప్పగా విని ఆకళించుకుని ప్రభుత్వోన్నతోద్యోగి, సాహిత్యాభిలాషి అనంతపంతుల రామలింగస్వామి  గ్రంథాన్ని రచించారు. 


రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మ్యూజియం పార్కులో శ్రీపాద వారి విగ్రహాన్ని  ఏర్పాటుచేశారు.
 శ్రీ రామేన ఆదినారాయణకు శ్రీపాద వారంటే ఎనలేని భక్తిప్రపత్తులు వుండేవి. అందుకే శ్రీ ఆదినారాయణ జీవించివున్నంతకాలం శ్రీపాద వారి జయంతికి మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించేవారు.
 

ఈమహనీయులు 1960, డిసెంబరు 29న దివికేగారు.
మహామహోపాధ్యాయ, కవిసార్వభౌమ బిరుదాంకితులు, ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థానకవి కీ.శే శ్రీపాద కృష్ణమూర్తి గారికి, వారు తెలుగు సాహిత్యమునకు చేసిన సేవను గుర్తుచేసుకుంటూ, వందనాలు సమర్పిస్తున్నాను.

2 కామెంట్‌లు:

  1. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి పుస్తకాలు లభ్యం అవుతున్నాయా? నెట్లో ఏమన్నా ఉన్నాయా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొన్ని పుస్తకాలు బయట మార్కెట్లో విడిగా దొరుకుతున్నాయి శ్యామ్ గారు. ఖచ్చితంగా విజయవాడ, హైదరాబాద్ లలో జరిగే పుస్తక మహోత్సవంలో లభిస్తాయి. వచ్చే మాసము మరియు ప్రతి సంవత్సరము ఆరంభంలో వీటి హడావుడి ఉంటుందన్నది మనకి సుపరిచితమే... ధన్యవాదాలు మాష్టారు...మీ తెలుగోడు_చైతన్య!💐.

      తొలగించండి

Blogger ఆధారితం.