జాతీయ గణిత దినోత్సవం

      శ్రీనివాస రామానుజన్

అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఉత్తర అర్కాట్ జిల్లా ఈరోడ్‌లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించినారు. రామానుజన్ పన్నెండేళ్ల వయసులోనే గణితంలో అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త. 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఉత్తర అర్కాట్ జిల్లా ఈరోడ్‌లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన రామానుజన్ పన్నెండేళ్ల వయసులోనే గణితంలో అసాధారణ బాలునిగా గుర్తింపు పొందారు. రామానుజన్ ‘ఆయిలర్’ సూత్రాలు, త్రికోణమితికి చెందిన అనేక సమస్యలను సులువుగా సాధించేవారు. కుంభకోణం గవర్నమెంటు కాలేజీలో చేరిన రామానుజన్ గణితం మీదే శ్రద్ధ చూపి మిగిలిన సబ్జెక్టులపై దృష్టి పెట్టకపోవడంతో పరీక్ష తప్పారు. ఆ తరువాత మద్రాస్‌లోని పచ్చయ్యప్ప కాలేజీలో చేరారు.


అక్కడ గణితోపాధ్యాయునిగా ఉన్న ఎన్. రామానుజాచారి గణిత సమస్యలను కఠినమైన పద్ధతిలో పరిష్కరించి చూపుతుంటే, రామానుజన్ వాటిని తనదైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించేవారు. రామానుజన్ గారి ప్రతిభను గమనించిన ప్రొఫెసర్ సింగారవేలు ముదలియార్, రామానుజన్‌తో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్‌లో క్లిష్టమైన సమస్యలను చర్చించి సాధిస్తుండేవారు. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ వంటి విషయాలపై రామానుజన్ గారు విశేష పరిశోధనలు చేశారు.

15 ఏళ్ళకే రామానుజన్‌లోని తెలివితేటలను ప్రపంచానికి చాటడానికి దోహదం చేసిన గ్రంథం జార్జ్ స్కూచ్‌సిడ్జ్‌కార్ రాసిన ‘సినాప్సిస్’. అందులో ఆల్‌జీబ్రా, అనలిటికల్ జామెట్రీ వంటి విషయాల మీద దాదాపు 6165 సిద్ధాంతాలున్నాయి. వీటి నిరూపణలు చాలా కష్టంగా ఉండేవి. పెద్దపెద్ద ప్రొఫెసర్‌లు సైతం అర్థం చేసుకోలేకపోయిన ఈ సిద్ధాంతాలను, సూత్రాలకు రామానుజన్ గారు ఎటువంటి పుస్తకాలను తిరగేయకుండా వాటి సాధనలను అలవోకగా కనుక్కునేవారు. అప్పటికే అందులో చాలా సమస్యలు నిరూపించబడ్డాయన్న విషయం ఆయనకు తెలియకపోవడం చేత వాటిని తన పద్ధతితో సాధించి చూపారు.

1903లో మద్రాసు విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్ వచ్చింది. లెక్కల వల్ల కొడుకుకి పిచ్చి పడుతుందేమోనని భయపడిన రామానుజం తండ్రి ఆయనకు పెళ్ళి చేశారు. సంసారం గడవటం కోసం 25 రూపాయల వేతనం మీద రామానుజన్ గారు గుమాస్తాగా చేరారు. చిత్తు కాగితాలను కూడా బహుజాగ్రత్తగా వాడుకుంటూ గణితమే లోకంగా బతికేవారు. గణితంలో ఆయన ప్రదర్శిస్తున్న ప్రజ్ఞను చూచి ఏ డిగ్రీ లేకపోయినా మద్రాసు విశ్వవిద్యాలయం నెలకు 75 రూపాయల ఫెలోషిప్ మంజూరు చేసింది. 1913లో మద్రాస్ పోర్ట్‌ట్రస్ట్‌కు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డా॥వాకర్ రామానుజన్ గారి పరిశోధనలు చూసి ఆశ్యర్యపోయి, రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను ఆ కాలంలో ప్రసిద్ధుడైన కేంబ్రిడ్జి ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్డి (1877-1947)కి పంపారు.

ఉన్నతస్థాయి గణితజ్ఞుడు రాయగల ఆ ఫలితాలను చూసి వెంటనే రామానుజన్‌ గారిని జి.హెచ్.హార్డీ కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. రామానుజన్ గారి లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ అసలు తాను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే అని వ్యాఖ్యానించడం జరిగింది. మార్చి 17, 1914న రామానుజన్ గారు ఇంగ్లండుకు ప్రయాణమయ్యారు. శాఖాహారపు అలవాట్లు గల రామానుజన్ గారు ఇంగ్లాండులో తానే వండుకుని తినేవారు. అక్కడి వాతావరణం సరిపడకపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, విశ్రాంతిలేని పరిశోధనలు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 32 పరిశోధనా పత్రాలను ఆయన సమర్పించారు.

ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చారు. బొద్దుగా, కొంచెం నల్లగా కనిపించే రామానుజన్ గారు ఇంగ్లండు నుంచి క్షీణించిన అనారోగ్యంతో రావటం చూసి ఆయన అభిమానులు చలించి పోయారు. అనేక రకాల వైద్య వసతులు కల్పించినా ఆయన కోలుకోలేకపోయారు. దీంతో 33 ఏళ్ళకే ఆయన 1926, ఏప్రిల్ 26న పరమపదించారు. రామానుజన్ గారు ఆ కాలంలో సుప్రసిద్ధులైన లీనార్డ్ ఆయిలర్, గాస్, జాకోబీ మొదలైన సుప్రసిద్ధమైన గణిత మేధావులతో పోల్చదగిన వారు.


1729 సంఖ్యను రామానుజన్ గారి సంఖ్యగా పిలుస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా హార్డీతో 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశారు. రామానుజన్ గారు అనారోగ్యంతో హాస్పిటల్లో వున్నపుడు, హార్డీ ఆయనను పలుకరించటానికి వెళ్లి మాటల మధ్యలో తాను వచ్చిన కారు నంబరు 1729, దాని ప్రత్యేకత ఏమైనా ఉన్నదా ? అని అడిగారు. అందుకు రామానుజన్  గారు ఆ సంఖ్య ఎంతో చక్కని సంఖ్య అని, ఎందుకంటే రెండు విధాలుగా రెండు ఘనముల మొత్తముగా వ్రాయబడే సంఖ్యాసమితిలో అతి చిన్నసంఖ్య అని తెల్పారు.
(1729 = 1^3 + 12^3 = 9^3 + 10^3).
 ఈ సంఘటన గణితంపై ఆయనుకున్న  అంకిత భావానికి నిదర్శనం.

ఫిబ్రవరి 28, 1918లో ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయునిగా, 1918 అక్టోబరులో ‘ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి’ గౌరవం పొందిన మొదటి భారతీయుడిగా రామానుజన్ గారు చరిత్రకెక్కాడు. చివరిదశలో రామానుజన్ గారు ‘మ్యాజిక్ స్క్వేర్’, ‘ప్యూర్ మాథ్స్‌కు చెందిన నంబర్ థియరీ’, ‘మాక్ తీటా ఫంక్షన్స్’ చేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధి పొందాయి. వీటి ఆధారంగా ఆధునికంగా కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రామానుజన్ నోటు పుస్తకాలపై, గణిత సిద్ధాంతాలపై రామానుజన్ ఇనిస్టిట్యూట్‌లో, అమెరికాలోని ‘ఇలినాయిస్’ యూనివర్సిటీలో నేటికీ రీసెర్చ్ జరుగుతోంది. గణిత శాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును ‘జాతీయ గణితదినోత్సవం’గా ప్రకటించింది.

రామానుజన్ గారు స్వరాష్ట్రమైన తమిళనాడు ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబరు 22ను రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962లో రామానుజన్ గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, సంఖ్యాశాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. మద్రాసు విశ్వవిద్యాలయం 'రామానుజన్ ఇనిస్టిట్యూట్'ని నెలకొల్పింది. గత సహస్రాబ్దిలో ప్రపంచానికి అత్యుత్తమ గణితశాస్త్ర సిద్ధాంతాలను, సూత్రాలను అందించిన అత్యుత్తమ అ'గణిత' మేధావి శ్రీనివాస రామానుజన్ గారు భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం.

కానీ శ్రీనివాసన్ రామానుజన్ గారి మరణానంతరం అంతటి ప్రతిభ గల గణితశాస్త్ర వేత్తలను భారతదేశం తయారు చేసులేకపోవడం దురదృష్టకరం. మానవ నాగరికత చరిత్రకు గణితాన్ని పరిచయం చేసిన ఆర్యభట్ట, భాస్కరుడు.... ఆ తదనంతరం రామానుజన్ గారి వంటి గణిత మేథావుల పరంపర ఆ తరువాత కొనసాగలేదు...!

4 కామెంట్‌లు:

Blogger ఆధారితం.