సాహితీ దిగ్గజం-"నగ్నముని

సాహితీ దిగ్గజం-"నగ్నముని"


        నగ్నముని పూర్తి పేరు మానేపల్లి హృషీకేశవ రావు. ఈయన దిగంబర కవులలో ఒకరు. వారు ఉద్యోగరీత్యా
రాష్ట్ర అసెంబ్లీలో జాయింట్ సెక్రటరీ పదవి నిర్వహించినా, వారు గొప్ప కవిగా, నాటకకర్తగా, నటునిగా, కథానికా రచయితగా పేరు పొందారు. వారి కొయ్యగుఱ్ఱం అనేక జాతీయ, అంతర్జాతీయ
భాషలలోనికి అనువదింపబడి వారికి ఎనలేని కీర్తి తెచ్చి పెట్టింది.


హృషీకేశవరావుగారు 1940 మే 15వ
తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. తల్లి శ్రీమతి లక్ష్మీకాంతమ్మ, తండ్రి శ్రీ మానేపల్లి సంగమేశ్వరకవిగారు.

నగ్నముని గారు బందరు, హైదరాబాదులలో విద్యనభ్యసించి బి.ఏ. మరియు కొన్ని సాంకేతిక విద్యలు అభ్యసించారు. రావుగారు 1958లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటి సెంబ్లీలో వెర్బాటిమ్ రిపోర్టర్‌గా నియమింపబడి తరువాత చీఫ్ రిపోర్టర్‌గా, అసిస్టెంట్ సెక్రటరీగా, డిప్యూటీ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా పదవులు నిర్వహించి 1998 మే నెలలో పదవీ విరమణ గావించారు. 1958 నుండి 1998 వరకు 40 సంవత్సరాల కాలం అవిచ్చిన్నంగా అసెంబ్లీలో వివిధ ఉన్నత పదవులను నిర్వహించిన ఏకైక శాసనసభ ఉద్యోగి హృషీకేశవరావుగారు మాత్రమే.

కేశవరావుగారు గొప్ప రచయిత. వారు మహాకవిగా, నాటకకర్తగా, కథానిక రచయితగా, వ్యాస రచయితగా, అనువాద కర్తగా ఖ్యాతి నార్జించారు. వారి రచనలు భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, తెలుగు స్వతంత్ర, గోలకొండ పత్రిక, కృష్ణాపత్రిక, ఉదయం మొదలైన పత్రికలలో ప్రకటింపబడ్డాయి.

దిగంబర కవులలో *నగ్నముని*గా ప్రసిద్ధినందిన హృషీకేశవరావుగారు తెలుగులో
లబ్దప్రతిష్ఠులైన ఆధునిక కవి. వారి తొలి కవితాఖండిక సౌందర్యపు స్వగతం 1957 నవంబరు తెలుగు స్వతంత్ర మాసపత్రికలో ప్రకటింపబడింది. తరువాత వారు నానాడు రచించి ప్రకటించిన కవితా ఖండికలు - 1962లో “ఉదయించని ఉదయాలు" అను ఖండకావ్యంగా ప్రకటించారు.

1965లో వారు (నగ్నముని) మరొక ఐదుగురు కవులతో - చెఱబండరాజు, మహాస్వప్న,
జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, భైరవయ్య అను ఆరుగురు కవులు సాహితీ చరిత్రలో దిగంబరకవులుగా ఖ్యాతిగాంచారు. ఈ దిగంబరకవుల కవిత్వం ఐదు సంవత్సరాలు సాగింది... మూడు సంపుటాలు వెలువరించారు. 1970లో ఏర్పడిన విప్లవరచయితల సంఘంలో నగ్నమునిగారు వ్యవస్థాపక సభ్యులు. 1972లో నగ్నమునిగారు “తూర్పుగాలి" కవితా సంపుటి ప్రకటించారు.

ఆధునిక మహాకావ్యంగా వినుతికెక్కినదీ, దీర్ఘకవితకు ఒరవడి పెట్టినదీ నగ్నమునిగారి "కొయ్యగుర్రం" కావ్యం. ఇది మొదట 1977 నవంబరులో ఆకాశవాణిలో ప్రసారం కావింపబడింది. 1978 జనవరిలో ఇది ప్రజా తంత్ర వారపత్రికలో ప్రకటింపబడింది. అటుపిమ్మట 1980లో ఇది గ్రంథరూపం దాల్చింది. ఇప్పటివరకు కొయ్యగుఱ్ఱం రష్యన్, ఇంగీషు, హిందీ, పంజాబి, కన్నడ, తమిళ భాషలలోనికి అనువదింపబడింది. కన్నడ
అనువాదానికి పురస్కారం లభించింది.

నగ్నమునిగారు రచించిన దీర్ఘకవితలు జమ్మిచెట్టు, అద్వైతరాజ్యం మొదలైనవి వివిధ పత్రికలలో ప్రకటింపబడ్డాయి. వారు ఇటీవల ప్రజాస్వామ్యకవిత అను శీర్షికను కవిత్వోద్యమం ప్రారంభించి కొన్ని కవితలు ప్రచురించారు.

నగ్నమునిగారు ప్రఖ్యాత నటులు, నాటకకర్త, ప్రయోక్తగా మంచి ఖ్యాతి నార్జించారు. 1959 సంవత్సరం నుండి కొన్ని సంవత్సరాలు రేడియో ప్రసారం చేసిన పలు నాటికలలో, నాటకాలలో వివిధ పాత్రలు పోషించారు. 1960 దశకం ప్రారంభంలో వారు శాసనసభ
కార్యాలయం తరపున ఆంధ్రప్రదేశ్ సచివాలయం అంతశాఖ నాటికల పోటీలో పాల్గొని 'చతురంగం" నాటికలో వారు ఉత్తమనటుడుగా ఎన్నుకోబడ్డారు. వారు ఉన్నవ లక్ష్మీ నారాయణగారి 'మాలపల్లి" నవలను 1974లో నాటకీకరించారు. అది వందకు పైగా ప్రదర్శనలివ్వబడింది. ఆకాశవాణి వారి కోరిక మేరకు నగ్నమునిగారు మాలపల్లిని ప్రసారయోగ్యంగా 1975లో తిరిగి వ్రాశారు. అది ప్రసారమయ్యింది. "ఇక్కడ కలలు అమ్మబడును" అను నాటకం వారు వ్రాయగా దానిని థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించారు.

నగ్నమునిగారు ప్రఖ్యాత కథారచయిత కూడా. వారి కథలు కొన్ని 1959 నుండి ఆకాశవాణిలో ప్రసారమౌతున్నాయి. వారు ఆనాడు రచించిన కథలు 16 ఎంపికచేసి 1973లో "నగ్నముని కథలు" అన్న శీర్షికతో ప్రకటించారు. వారు ప్రయోగాత్మకంగా
ప్రయోజనాత్మకంగా రచించిన కథలు ఎమర్జెన్సీ కాలంలో ప్రచురించడం మొదలు పెట్టారు. అది 1979లో “విలోమ కథలు" అన్న పేరుతో ప్రకటింపబడ్డాయి. అవి మరల 2002 జూన్లో రెండవసారి ముద్రింపబడ్డాయి.

అంతేకాక వారు “మరోచరిత్ర”, “ఎం.ఎల్.ఏ.ఏడుకొండలు", "త్రిశూలం”, “ఉదయం" మొదలైన సినిమాలకు కథా సహకారం అందజేశారు. వారు ఉదయం దినపత్రికలో "అక్షరాయుధం" శీర్షికను వారం వారం లఘువ్యాసాలు వ్రాశారు.

అదేవిధంగా వారు  ఆంధ్రప్రభ దినపత్రికలో కూడా చేదుమాట" అన్న శీర్షికను లఘువ్యాసాలు వ్రాయడం
జరిగింది. 1990లో వారు 'రేపటి ప్రజాస్వామ్య పరిశోధనా కేంద్రం" పేర ఒక వేదికను ఏర్పాటుచేసి అందులో వివిధ రంగాలకు చెందిన వారితో ఉపన్యాసాలిప్పించారు.

1) నగ్నముని అసలు పేరు మానేపల్లి హృషీకేశవరావు. గుంటూరు జిల్లా తెనాలిలో 1940, మే 15 తేదీన జన్మించాడు. బందరు, హైదరాబాదులలో విద్యాభ్యాసం చేశాడు.1958 నుండి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో రిపొర్టర్ గా పనిచేసాడు. కొంతకాలం 'దిగంబర' కవితాఉద్యమంలో ఉన్నాడు. విరసం వ్వవస్థాపక సభ్యుల్లో ఒకడు. ఆయన రచనలు

ఉదయించని ఉదయాలు (1962)

తూర్పుగాలి (1972)

కొయ్యగుర్రం (1977)

జమ్మిచెట్టు (1987)

నగ్నమునికథలు (1971)

విలోమకథలు (1979)

ఉన్నవలక్ష్మీనారాయణ 'మాలపల్లి ' నవలను 1974లో నాటకీకరించాడు. మరోచరిత్ర, ఎం.ఎల్.ఏ.ఏడుకొండలు, ఉదయం సినిమాలకు కథ స్క్రీన్‌ప్లే సమకూర్చాడు.

పురస్కారాలు:-

ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు -1973 లో

మద్రాసు తెలుగు అకాడెమీ వారి పురస్కారం - 1989

కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం - 1991

తెలుగు విశ్వవిద్యాలయం సత్కారం - 1991

2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం.

తెలుగు కవిత్వ సీమలోకి దిగంబర కవిత్వం ఒక ప్రభంజనంలా వచ్చి ఒక ఊపు ఊపింది ఆ రోజుల్లో. ఆ దిగంబర కవులకి ప్రయోక్త అనదగిన వ్వక్తి నగ్నముని .దిగంబర కవిత్యోద్యమంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించినకవి నగ్నముని. నిఖలేశ్వర్‌, నగ్నముని, చెరబండరాజు, జ్వాలాముఖి, మహాస్వప్న, భైరవయ్య అనే ఆరుగురు కవులు దిగంబర కవితా ఉద్యమాన్ని తీసుకొచ్చారు. సామాజిక రుగ్మతలపై శంఖం పూరించిన దిగంబర కవిత్యోద్యమం ఉధృతంగా సాగి కవితారంగాన్ని చైతన్యపరచింది.

ప్రస్తుతం భారతీయ ప్రజాస్వామ్య అధ్యయనం" సందర్భంగా కవితలు, వ్యాసాలు
ప్రచురిస్తున్నారు. నగ్నముని గారి జీవితంలో ఒక ముఖ్య సంఘటన - 1975 ఏప్రిల్ లో  జరిగిన ప్రపంచ తెలుగుమహాసభల సమయంలో వారు అరెస్టు చేయబడారు. అనేకమంది కవులు, రచయితలు వారిని విడుదల చేయాలని ఒత్తిడి తేవడం వలన ప్రభుత్వం వారిని 38 గంటల తరువాత విడుదల చేసింది.

1975 జూన్ 25వ తేదీన ఎమర్జెన్సీ విధించినసందర్భంలో వీరి రచనలపై, ఉపన్యాసాలపై ప్రభుత్వం నిఘా ఎక్కువ చేసింది. 1975 డిసెంబరు 22వ తేదీన ప్రభుత్వం వారిని ఉద్యోగం నుండి డిస్మిస్ చేసింది.

లోకసభకు  ఆకాలంలో తిరిగి ఎన్నికలు నిర్వహించడం జనతా ప్రభుత్వం పరిపాలనా పగ్గాలు చేపట్టిన తరువాత వారు తిరిగి ఉద్యోగంలో నియమింపబడడం జరిగింది. 1998లో వారు ఉద్యోగవిరమణ చేసిన దగ్గర నుండి రచనలు చేయడం, సాహిత్య విషయాలపై ఉపన్యసించడం వారి దైనందిన చర్యగా మారింది. వారి అభీష్టం - అన్ని అంశాలను తాత్విక కోణం నుండి
వీక్షించడం - కవిత - కథ, వ్యాసరచన గావించడం అని చెప్పాలి.

ధిక్కార‌మే దిగంబ‌ర గ‌ళం

 అత‌డు అస్త‌వ్య‌స్థ వ్య‌వ‌స్థ‌పై గ‌ర్జించిన ధిక్కార గ‌ళం. ద్వంద్వ విలువ‌ల‌పై ప్ర‌ళ‌య గ‌ర్జ‌న‌. ఎన్నిక‌ల హామీల వ్యూహాల‌తో ప్ర‌జ‌ల్ని నిలువునా ద‌గా చేస్తున్న రాజ‌కీయ నాయ‌కుల్ని న‌డిబ‌జారుకీడ్చ‌మ‌న్న న‌గ్న‌గీతం. పాల‌కుల చీక‌టి బాగోతంపై అత‌డో ఎక్కుపెట్టిన నిర‌స‌న‌ ప్ర‌క‌ట‌న‌. దేశంలోనే తొలిసారిగా రాజ్య ధిక్కార గొంతెత్తిన ఆధునిక తొలి దేశీయ కవి. ‘సౌందర్యపు స్వగతం’ నుంచి ఆవిర్భవించి ‘ఉదయించ‌ని ఉదయాలు వెలిగించిండు. ఈ వ్య‌వ‌స్థ తాలూకు చీక‌టి విలువ‌ల్ని ‘కొయ్యగుర్రం’తో, అవకాశవాదమే జీవన విలువలుగా వంచిస్తున్న నకిలీ వ్య‌క్తిత్వాల‌పై ‘విలోమ క‌థ‌లు’లో బయటపెట్టాడు. కుళ్లిన పాలక వ్యవస్థపై తిరగబడే క‌విత్వాన్ని మండించాలంటున్న‌’నగ్నముని’ గారిని స్మరించుకుందాం.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.