అమరావతి కథలు - వరద/amaravathi kathalu

అమరావతి కథలు - వరద



                  అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనక సూర్య కిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారుపూత అమరేశ్వ రాలయ శిఖరం. ఎత్తయిన ఆ శిఖరానికి చుట్టుతా ఎన్నో ఆలయాలు. ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుపడ్డ బౌద్ధ స్తూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని వాటి మధ్యలో ఉండే ప్రజల్ని ఆ ఊర్ని వడ్డాణంలా చుట్టి గలగల పారుతున్న కృష్ణానది, అద్గదీ అమరావతి.


         ఒకనాడు గుర్రాలు, రధాలూ తిరుగుతూండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజ వీధిలో ఇవ్వాళ కుక్కలూ, గాడిదలు, మేత దండగని ఊరు మీద తోలేసిన సాంబయ్యగారి ముసలి ఎద్దూ నీరసంగా తిరుగుతున్నాయి. రత్నాల రాసులూ, ముత్యాల మూటలూ బళ్ళకెత్తుకు నడిపించిన ఆ వీధిలో ఇవ్వాళ పొట్టు బస్తాలు లాగుడు బండి మీద తొయ్యలేక తొయ్యలేక తోస్తున్నారు. అంత పెద్ద వీధి ఎవరు వూడ్చి  శుభ్రం చేస్తారు? ఎవరిళ్ళ ముందు వాళ్ళు వూడ్చుకొని, కళ్ళాపు జల్లుకొని, కసువంతా నడిబజార్లో పోస్తారు. ఆ కసుపు కుప్పల మీద కుక్కలు ముడుచుకు పడుకంటే, ఇంకోపక్క కోళ్ళు, కోడిపిల్లలు ముక్కుల్తో గెలుకు తూంటాయి. 


    ఒకనాడు భేరీలు మోగించే ఉత్తర గాలిగోపురంలో పిచ్చి - సూరిగాడు పీలికలు  కాళ్ళ నిండా చుట్టుకొని గంజాయి దమ్ము లాగుతున్నాడు. ఆ విశాల వటవృక్షాల కింద ఒకనాడు శ్రవణ పర్వంగా వేదగానం విన్పిస్తే, ఇవ్వాళ "నా కొడకా: నా ముక్కకె  అడ్డొచ్చావు గదరా !" అంటూ పేకట జోటుగా సాగుతోంది. 


 బౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది దేశ విదేశీ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసినచోట - దిబ్బలు, వొట్టి దిబ్బలు కన్పిస్తున్నాయి. దిగులుగా ఉన్న ఆ దిల్బలమీద పందులు తిరుగుతున్నాయి. వాటిని అదిలిస్తున్న వడ్డిరోళ్ళ పోరగాళ్ళు కన్పిస్తున్నారు.


           కృష్ణకి నీళ్ళకెళ్తున్న ఓ పడుచుపిల్ల ముత్యాల కాలిపట్టి జారిపోతే "కంగా రెందుకులే" అనుకుని ఆ పిల్ల కృష్ణలో నీళ్ళు ముంచుకుని ఆ లిండె ఇంట్లో పెట్టి తిరిగివస్తే ఆ ముత్యాల పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకొని గునుగున వెళ్ళిపోయిందట. ఇవ్వాళ కృష్ణకి నీళ్ళకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకీ కాలి పట్టీలు లేవు.. అయినా గునగున  నడిచి పోతూనే ఉన్నారు. ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి. గుండెల్లో ఎంత దిగులున్నా...ఆప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి.


         గతాన్ని కడుపులో దాచుకుని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తోంది. కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలొరసి పారుతోంది. పరమేశ్వరునికి పాదాభిషేచనం చేస్తూ ముందు కెళ్తోంది. ఆల్లంత దూరాన, సూరీడు రాతి రేళ పడుకునే చోటు నుంచి బయలుదేరి పరుగు పరుగున అమరావతి వైపు కొస్తున్నాడుకన్ను సారించి చూస్తే రెండు కొండ కొమ్ముల మధ్యనుంచి వచ్చే కృష్ణ  కావలసిన చుట్టం ఊరునుంచి వస్తున్నట్టుంది. తుళ్ళి తుళ్ళి పారుతోంది. మళ్ళీమళ్ళీ పారుతోంది. తలంటు పోసుకొని విప్పుకున్న జుట్టులా పాయలు, పాయలుగా పారుతోంది. పాయలు ఆ జుట్టుని బంధించి జడగా అల్లినట్లు ఏక పాయగా పారుతోంది.


                   ఇంకా తెల్లారలేదు. దొడ్లల్లో హోరు, ఊళ్ళో హోరు. ఉన్నట్టుండి. కృష్ణ పొంగింది. రాత్రికి రాత్రి వరదొచ్చింది. ప్రళయంగా పొంగింది. ఆ మసగ వెల్తుర్లో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది. దొడ్లల్లో లేరు మెత్తు నీళ్ళు వచ్చేశాయి. జనంగోల, హడావుడి, తోసుకోట మట్టిగోడలు విరిగి పడిపోతున్నాయి. గుడి పక్క వీధిలో ఉన్న ఇల్లు ఎత్తుమీద ఉన్నా దొడ్లో సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసి పోయింది.


పల్లవీధి మూడొంతులు మునిగిపోయింది.
మిట్టి మీరికి నీళ్ళెస్కకున్నాయి. 
యానాదుల గుడిసెలు ఎగిరిపోయాయి!
కొట్టాల్లో పశుపులు కట్టుగొయ్యల్తో సహా కృష్ణలో కలిసిపోయాయి.
రేవులో పడవలు గల్లంతు,
లాంచీలు లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోయాయి :


                తెలతెలవారుతూంటే కృష్ణమ్మ ప్రళయరూపం కన్పించింది. ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతోంది. అవతలొడ్డు కానటంలేదు. ఎదురుగా జల సముద్రం, ఎగిరెగిరి పడ్తున్న అలలు. మహా ప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇళ్ళ కప్పులు, క్షణంలో ఆ కప్పు నీళ్ళలో కలిసిపోయింది. మోరలెత్తి అంబా అని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి. మోరలు మనిగిపోతున్నాయి. ఆ వడిలో  కొమ్ములు మునిగిపోతున్నాయి. కొట్టుకొస్తున్న దుంగలు, కలప. ఓ దుంగ  మీద వూర కుక్కొకటి దీనంగా మొరుగుతోంది రక్షించమని. ఆ వేగానికి దుంగ మెలికలు తిరుగుతుంటే తనూ గిరగిర తిరుగుతూ కాళ్ళు నిల దొక్కుకుంటోంది ప్రాణభయంతో ఉన్న కుక్క.


          అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక. "దేవుడోయ్ రచ్చించండో " అని గుండెలు చీల్చుకుపోయే కేక, క్షణంలో ఆ కేక దూరమైంది. మనిషి కన్పించలేదు. ఎవరూ ఏం చెయ్యలేదు. సాయానికి ఎవరైనా వెళ్తే ఆ  వడికి తిరిగి రాలేరు. నిస్సహాయంగా ఆ బీభత్స భయానక దృశ్యాల్ని చూస్తున్నారు వొడ్డున నుంచున్న జనమంతా. అందరి గుండెల్లో భయం.


       ఇళ్ళ ముందుకు నీళ్ళు రావడంతో పిల్లలంతా కాగితం పడవలాట లాడుకుంటున్నారు. పడవలు చేసి పెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు. స్కూలు గోడమీద బొగు గీతలు గీసి క్షణక్షణం పెరుగురున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు. "పల్ల వీధిలో అర్ధరాత్రే సంగయ్యింల్లో పనిపిల్లకి తడితగిరి అదేడిస్తే లేచాడంటయ్య అప్పటికి గోడలిరిగె. నీళ్ళు తోసుకొచ్చె! పెళ్ళం పిల్లలూ పానాల్తో బయట కొర్చారంట".


 "మిట్టమీది ఎంకటసామి మేకల మందంతా కొట్టుక పోతుంటే  ఏం చెయ్యలేక సూస్తా నుంచున్నాట్టయ్య " "సాలెపేటలో  వరదలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లోదూరి సుబ్బయ్యని కరిచిందంట" "లంకల్లో మేతకెళ్ళిన గొడ్లు, పాలేళ్ళు ఏవయినారో " 


               ఇలా భయంకరమైన కథలు చెప్పుకొంటున్నారు. కొందరు ఇల్లాళ్ళు కృష్ణమ్మని శాంతించమని పసుపు, రుంకుమ అర్చించి కొబ్బరి కాయలు కొడ్తున్నారు. పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడు తున్నారు . ఊరు సగం మునిగిపోయింది. దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్య నున్న మాలక్షమ్మవారి చెట్టు దగ్గర చేరారు. చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాలలు వేశారు. పది గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది. వూళ్ళో పెద్దలు వెంకటస్వామి, వీరాస్వామి, అవధాన్లు అంతా మాలక్షమ్మ వారి చెట్టుదగ్గర కొచ్చారు. "ఇప్పుడేం చేద్దాం ! ఏం చేద్దాం" అని తలపట్లు పట్టుకున్నారు.


                  "చేసే దేముందయ్య మంది జనానికి  తిండీ తిప్పలూ చూడండి" అన్నా రెవరో. అంతే పదిమంది కుర్రాళ్ళు  గడ్డపారలు తీసుకుని గాడిపొయ్యి తవ్వే శారు. ఇంకో పదిమంది గోతాలు తీసుకొని ఇంటింటికీ వెళ్ళి బియ్యం వసూలు చేశారు. కోటలో వంట సామగ్రి తెచ్చారు. పప్పూ, ఉప్పూ, నెయ్యి, వాటంతట అవే వచ్చాయి. ఎసట్లో బియ్యం పోశారు. వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు, శోభనాద్రి "ఇహా కూరలే ఆలస్యం" అన్నారు. అవధాన్ల గారి భార్య, కోమటి సూరమ్మ, తెలగ వెంకమ్మ, గొల్ల సుబ్బమ్మ  కత్తిపీటలు ముందేసుకొని చకచక కూరలు తరిగేశారు. పన్నెండు గంటలకల్లా రోసకాయ పప్పు, పలుసు అన్నం తయారయి పోయాయి.



 సెట్టిగారు విస్తళ్ళ కట్టలిస్తే  నడి బజారులో బారులుగా  విస్తళ్ళు  వేశారు. శాస్త్రిగారు సంధ్యావందనం ముగించుకుని తనూ విస్తట్లో కూర్చున్నాడు. ఇటు ప్రక్క చూస్తే సుబ్బారాయుడున్నాడు. ఇంకోపక్క గొల్ల రాములున్నాడు. ఎవరిపక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు. భగవన్నామ స్మరణలు సాగుకున్నాయి.


                   వడ్డనలయిపోయాయి. శాస్త్రిగారు ఆవుపోసన పట్టి నెయ్యికోసం చెయ్యి జాస్తే వడ్డించటానికి వచ్చిన నేతి జాడీ చెంగున వెనక్కి వెళ్ళింది. వడ్డిస్తున్న  మాల సంగడు శాస్త్రి గారికి వడ్డించటం ఇష్టంలేక పారిపోతున్నాడు. శాస్త్రిగారు "ఒరే సంగా" అని పెద్దగా కేక పెడితే, భయం భయంగా వొచ్చిన సంగన్ని చూసి "ఒరే సంగా, నీకు ఆకలేస్తుంది. నాకూ  ఆకలేస్తుంది, ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి, నువ్వు వేస్తే కాకపోదురా అన్నాడు". చెయ్యి ముందుకు చాపి, సంగడు ఆనందంగా వడ్డించాడు. "నమ: పార్వతీ పతయే" అన్న కేకలు దేవాలయ శిఖరాల్నంటాయి.

 
వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా ? అబ్బే నాకు నమ్మకం లేదు. స్నానంచేసిన వొంటికి తెల్లారేప్పటికి మట్టి పట్టినట్టు మనసుల్లో మలినం పేరుకుంటుంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది.

                                                                                                                        ఆధార గ్రంథం 
                                                                                                                    అమరావతి కథలు 
                                                                                                                   సత్యం శంకరమంచి 

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.